కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. శనివారం ఆ పార్టీ అగ్ర నాయకులతో ఢిల్లీలో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షాను కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి.. తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు. జేపీ నడ్డా నివాసంలోనే బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కూడా కలిశారు.
ఇదే సమయంలో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్, యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చలు జరిపారు. వీరితో పాటు కిరణ్కుమార్రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కిరణ్ కుమార్రెడ్డికి పలు కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా బెంగళూరు కేంద్రంగా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటనను ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. అప్పుడే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనుంది. ఈ బోర్డు సమావేశానికి ముందే పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాటి భేటీలో చర్చించిన అంశాలను తిరిగి బోర్డులో కూడా చర్చించిన తర్వాత బీజేపీ పెద్దలు ఆమోదముద్ర వేయనున్నారు.
అయితే, బీజేపీలో చేరిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమైంది. కర్ణాటక ఎన్నికల తర్వత కిరణ్ కుమార్ రెడ్డి సేవలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డిని కాషాయ దళంలో చేర్చుకుంది. 64 ఏళ్ల కిరణ్ కుమార్ అవిభక్త ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి. మరోవైపు, చాలా కాలం పాటు కాంగ్రెస్తో అనుబంధం కలిగి ఉన్న తాను పార్టీని వదులుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa