సరిహద్దుల విషయంలో భారత్...చైనా మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఆయన పర్యటనను చైనా తప్పుబట్టింది. అమిత్ షా పర్యటన ఆ ప్రాంతంపై చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఈ వాదనను భారతదేశం పూర్తిగా తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామం, భారతదేశానికి తూర్పు వైపున ఉన్న కిబితూ నుంచి 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్'ను హోం మంత్రి షా సోమవారం ప్రారంభించారు.
అమిత్ షా.. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. "జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్కు చైనీస్ పేరు) అనేది చైనా భూభాగం" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. "ఈ ప్రాంతంలో భారత అధికారుల కార్యకలాపాలు చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇవి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు అనుకూలంగా లేవు. మేము దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడాన్ని.. భారతదేశం గత వారం తిరస్కరించింది. ఆ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, అలాంటి రాష్ట్రంలోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ టిబెట్గా చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్లోని మరో 11 ప్రదేశాలకు.. చైనా పేర్లను బీజింగ్ ప్రకటించింది. అయితే.. చైనా ఇటువంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని.. తాము దీన్ని తిరస్కరిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ చైనా పలు పేర్లను ప్రకటిస్తూ.. వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు స్థలాల పేర్లలో మొదటి ప్రకటనను 2017లో విడుదల చేయగా.. రెండోసారి 15 స్థలాలను 2021లో జారీ చేశారు. మే 2020లో ప్రారంభమైన తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలోనే.. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాలకు చైనా పేర్లు ప్రకటిస్తూ.. వస్తోంది. తాజాగా అమిత్ షా పర్యటన పైనా విమర్శలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa