కంటిమీద కునుకులేకుండా పంజాబ్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోయినా కాస్త ఊరాట మాత్రం లభించింది. పరారీలో ఉన్న ఖలీస్థాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ కోసం మూడు వారాలుగా పంజాబ్ పోలీసులు వేట కొనసాగుతుండగా.. సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అమృత్పాల్కు అత్యంత సన్నిహితుడు, అతడితో కలిసి పరారైన పపల్ప్రీత్ సింగ్ పోలీసులకు పట్టుబడ్డాడు. హోషియార్పూర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అతడ్ని అదుపులోకి తీసుకుంది. పంజాబ్, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి మాజీ జర్నలిస్ట్ను అరెస్ట్ చేశారు. జలంధర్ జిల్లాలో మార్చి 18న అమృత్పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే.
అప్పటి నుంచి అమృత్పాల్, పపల్ప్రీత్ సింగ్ పరారీలో ఉండగా.. చాలా చోట్ల ఇద్దరూ కలిసే తిరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, హోషియార్పూర్లో మాత్రం ఎవరికి వాళ్లు వేర్వేరు దారుల్లో వెళ్లినట్టు తెలిపారు. వారి కోసం భారీ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు పపల్ ప్రీత్ను అరెస్ట్ చేశారు. అమృత్ పాల్కి కుడి భుజం అయిన పపల్ ప్రీత్ అరెస్ట్తో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. పపల్ ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.
‘అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడు.. అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తరవాతే పోలీసులకు వీడియో పంపాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడు’ అని పపల్ తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే, అమృత్ ఎక్కడున్నదీ ఇంకా ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకూ పోలీసులకు పంజాబ్ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.
ఏప్రిల్ 14న పంజాబీలకు కీలకమైన బైశాఖి రోజున సర్బత్ ఖల్సా కార్యక్రమం జరగనుంది. ఆ సందర్భంగా అకాల్ తఖ్త్ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. అంతేకాదు, సర్బత్ ఖల్సా నిర్వహించాలని అమృత్ పాల్ సింగే సూచించాడు. ఆ రోజే అమృత్ పాల్ లొంగిపోతాడనే వాదనా వినిపిస్తోంది. అందుకే అప్పటి వరకూ పోలీసులు నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో అందరి సెలవులనూ రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa