ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలేజీలో చేరటానికి అని వచ్చి... మృత్యువు చేతికి చిక్కిన విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 02:57 PM

 నర్సీపట్నం మునిసిపాలిటీ, మాకవరపాలెం మండలం సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  వివరాల్లోకి వెళ్ళితే...  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ మల్లవరం గ్రామానికి వంజంగి చెల్లయ్యమ్మ(18) ఇంటర్‌ పూర్తిచేసింది. నర్సింగ్‌ కోర్సులో చేరాలన్న ఉద్దేశంతో విశాఖలోని ఒక కళాశాలలో దరఖాస్తు చేయడానికి తన సోదరుడు వంజంగి కిరణ్‌(21), వరుసకు బావ అయిన కంచు గణపతి(35)తో కలిసి సోమవారం ఉదయం ఇంటి నుంచి బైక్‌ మీద విశాఖపట్నం వెళ్లారు. కాలేజీలో దరఖాస్తు అందజేసిన తరువాత తిరిగి మల్లవరం బయలుదేరారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం దాటిన తరువాత, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని సుబ్బారాయుడుపాలెం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొన్నది. దీంతో బైక్‌ నడుపుతున్న కంచు గణపతి అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌, చెల్లయ్యమ్మలను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కిరణ్‌ మృతిచెందాడు. చెల్లయ్యమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు పంపారు. ఈమె పరిస్థితి ఆందోళనకరంగా వుందని బంధువులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరైన కంచు గణపతి సొంతూరు పాయకరావుపేట మండలం పీఎల్‌పురం గ్రామం. ఏజెన్సీలో తాపీ పని చేసుకుంటూ ఒక గిరిజన యువతిని వివాహమాడి అక్కడే స్థిరపడ్డాడు. ఇతనికి భార్య కల్యాణి, రెండేళ్ల కుమార్తె వున్నారు. కల్యాణి ప్రస్తుతం గర్భవతి. మరో మృతుడు కిరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం మాకవరపాలెం మండల పరిధిలో వుండడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa