ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోథిబే సంస్థ ఆసియ సంస్థ స్వర్ణోత్సవ వేలం,,,18వ శతాబ్దం నాటి పింగాణీ గిన్నెకు భారీ ధర

international |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 09:14 PM

ఓ చిన్న సైజు పింగాణీ పాత్ర, జగ్గు ధర సాధారణంగా రూ.వందల్లో ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవి వేలల్లో ఉంటాయి. కానీ, ఓ పింగాణీ గిన్నె ఏకంగా రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లకు అమ్ముడిపోయిందంటే నమ్ముతారా?. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. పురాతన వస్తువులు, కళాఖండాల వేలంలో పింగాణీ గిన్నె, జగ్గు వందల కోట్ల ధర పలికాయి. పురాతన, అరుదైన కళాఖండాలు, వస్తువులను వేలం వేసే సోథిబే సంస్థ ఆసియాలో తమ కార్యాలయం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఓ ప్రత్యేక వేలం నిర్వహించింది.


ఈ సందర్భంగా చైనాకు చెందిన అరుదైన కళాకృతులను వేలం వేశారు. అందులో 18వ శతాబ్దానికి చెందిన 4.5 అంగుళాల ఓ పింగాణీ గిన్నె ఏకంగా 198.2 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు (25 మిలియన్‌ డాలర్లు) పైనే పలికింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.205 కోట్లు. దాదాపు 300 ఏళ్ల కిందట ఈ గిన్నెను 1722-35 మధ్య యోంగ్‌జింగ్‌ రాజు హయాంలో అరుదైన పింగాణీతో దీనిని తయారుచేసినట్లు సోథిబే తెలిపింది. దీనిపైన ఎనామిల్‌తో రెండు పక్షులు, వికసిస్తున్న ఆప్రికాట్‌ చెట్టును చిత్రీకరించారు.


ఇటువంటి గిన్నెలను రెండు తయారుచేయగా.. 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా విక్రయించారు. ఇందులో ఒకటి ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో ఉండగా.. రెండో దాన్ని హాంకాంగ్‌లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నెకు 198.2 మిలియన్‌ హాంకాంగ్ డాలర్ల ధర లభించినట్లు సోథిబే తెలిపింది. ఈ పాత్రను ఎవరు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మింగ్ రాజవంశానికి చెందిన ఓ మంచి నీళ్ల జగ్గు 13.7 మిలియన్ డాలర్లు (రూ.110 కోట్లు)కు అమ్ముడుపోయింది. ఇక, ఈ వేలంలో చేతి గడియారాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వింటేజ్‌ వైన్లతో పాటు చారిత్రక గుర్తింపు కలిగిన పూల కుండీలు, ఇతరత్రా వస్తువులను వేలం వేశారు.


సిరామిక్స్ నిపుణుడు రెజీనా క్రాల్ మాట్లాడుతూ.. యోంగ్‌జెంగ్ కాలంలో పక్షులు, పువ్వులతో కూడిన కళాఖండాలు ప్రసిద్ధి చెందాయి. ‘పింగాణీపై చిత్రలేఖనం, కళాత్మకతను అధిగమించలేదు’ అని సూచించే ఒక చిన్న సమూహంలో ఉన్నట్లు వివరించింది. ‘పాత్ర చుట్టూ కనిపించే విధంగా చిన్న, శుద్ధి చేసిన ప్రకృతి మూలాంశాలతో చిత్రీకరించిన మొక్కలు, హ్యాండ్‌స్క్రోల్ వంటివి ఉన్నాయి’ అని ఆమె అన్నారు. గతవారం 1973 నాటి ఓ చైనా పెయింటింగ్ ఏకంగా 32 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోవడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa