అనంతపురం జిల్లా, గుత్తి మండలం, జక్కలచెరువు గ్రామ శివారులో 67వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర (38), రాణి (35) దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్ళితే.... గుంతకల్లు మండలం దంచర్ల గ్రామానికి చెందిన నాగేంద్ర, రాణి పెద్దపప్పూరు మండలం కుమ్మెత నర్సాపురం గ్రామానికి వెళ్లారు. తమ బంధువుల ఇంటిలో కర్మకాండలకు హాజరై.. తిరిగి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి వెళుతుండగా జక్కలచెరువు సమీపంలో లారీ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగేంద్ర, రాణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాగేంద్ర ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయన భార్య రాణి వ్యవసాయ కూలి పనులకు వెళ్లి భర్తకు చేదోడుగా ఉండేది. దంపతుల మృతితో వారి ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. మొదటి కూతురు దీన 9వ తరగతి, రెండో కూతురు సుగుణ 8వ తరగతి, మూడో కూతురు మణి 7వ తరగతి చదువుతున్నారు. ప్రమాద విషయం తెలియగానే వారి బంధువులు, కుటుంబ సభ్యులు భారీ ఎత్తున గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa