భక్తులకు సౌకర్యార్థమై టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందొచ్చుని టీటీడీ తెలిపింది. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు అని అలర్ట్ చేశారు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలంటోంది టీటీడీ. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని గుర్తు చేశారు. ఇటు శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారని తెలిపారు.
మరోవైపు వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి టీటీడీ సహకరించాలని కోరారు. టీటీడీ ఈ నెల 1 నుంచి దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మన్యం జిల్లా సీతంపేటలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. డెప్యుటేషన్ సిబ్బందికి బస ఏర్పాట్లు చేయాలని, భక్తులకు అవసరమైన తాగునీరు, అన్న ప్రసాదాలు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయం, కల్యాణ మండపం వద్ద విద్యుద్దీపాలంకరణ చేపట్టాలన్నారు.
భక్తులు ఎండ వేడికి ఇబ్బంది పడకుండా చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల్లో విచ్చేసిన భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయం వద్ద సుందరీకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలన్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణకు విచ్చేసే వేద పండితులు, అర్చకస్వాములకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa