ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కాగా.. షెడ్యూల్ ప్రకారం కేదార్నాథ్ ఆలయంలో మంగళవారం పూజలు ప్రారంభించి భక్తులను అనుమతించాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఏప్రిల్ 30 వరకూ కేదార్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కేదార్నాథ్ యాత్రకు రిషికేశ్, హరిద్వార్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్టు గర్వాల్ అడిషనల్ కమిషనర్, చార్ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ సీఈఓ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు. గర్వాల్ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం వాతావరణ పరిస్థితులను సమీక్షించి భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం నుంచి కేదార్నాథ్ ధామ్ తెరుచుకోనుండగా.. భక్తులు తగిన జాగ్రత్తలతో చార్ధామ్ యాత్రకు రావాలని, వెచ్చగా ఉండే దుస్తుల్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏడాదిలో ఆరు నెలల పాటు సాగే చార్ధామ్ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండ్లోని హిమగిరుల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పుష్కర్ ధామీ సర్కారు ఆరోగ్య సూచనలు జారీ చేసింది. అన్ని పుణ్యక్షేత్రాలు ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నాయని, సముద్ర మట్టానికి 2,700 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయని అందులో పేర్కొంది. విపరీతమైన చలి, గాలిలో పీడనం, తేమ, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయని హెచ్చరించింది. యాత్రికులందరికీ సాఫీగా, సురక్షితమైన ప్రయాణం కోసం మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది.
సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో వాతావరణం క్షణాల్లో మారిపోతుంటుంది. రెండు రోజులుగా అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో యాత్రికుల భద్రత దృష్ట్యా దర్శనాల రిజిస్ట్రేషన్కు తాత్కాలికంగా అధికారులు విరామం ప్రకటించారు. ఇక, సెల్ఫీ పిచ్చి కేదార్నాథ్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్నాథ్ దామ్ హెలిప్యాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం హెలికాప్టర్తో సెల్ఫీ తీసుకునేందుకు దానికి దగ్గరగా వెళ్లారు. అనంతరం హెలికాప్టర్ తోక భాగంలోని రెక్కలు తగిలి మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa