ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో కొనసాగుతున్న రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన,,బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఢిల్లీ పోలీసుల కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 30, 2023, 10:51 PM

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ గత నాలుగు రోజుల నుంచి రెజ్లింగ్ క్రీడాకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. రెజ్లింగ్ క్రీడాకారులు తనకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో కొత్త డిమాండ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తొలుత తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారని, ఇప్పుడు జైలుకు పంపించాలనీ, పదవుల నుంచి తప్పించాలని కోరుతున్నారని అన్నారు.


అయితే, తనపై ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. రాజీనామా పెద్ద విష‌యం కాదన్న ఆయన... ఒకవేళ తాను పదవి నుంచి తప్పుకుంటే నేరాన్ని అంగీకరించినట్టు అవుతుందని తెలిపారు. నేను నేరస్థుడ్ని కాదని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు పేర్కొన్నారు. మరో 45 రోజుల్లో రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నిక‌లు జరగనున్నాయని, త‌ర్వాత త‌న పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ తెలిపారు. అంతేకాదు, ఓ అకాడ‌మీకి చెందిన కుటుంబం మాత్రమే నిర‌స‌న‌లు చేపట్టిందని, హ‌రియాణాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు త‌న‌ వెంటే ఉన్నార‌ని తెలిపారు. తనకు ఇది గడ్డుకాలం కాదని, కష్టాలను ఎదుర్కోవడం తనకు కొత్తకాదని చెప్పారు.


తాను ఏ తప్పుచేయలేదని, ఏ విచారణకైనా పూర్తిగా సహకరిస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలపై తనకు బలమైన నమ్మకం ఉందన్నారు. ‘కొన్ని నెలలు నుంచి నేను వేధింపులు, ఆరోపణలను ఎదుర్కొంటున్నాను... ఇది నా కుటుంబాన్ని, మద్దతుదారులను బాధిస్తుంది, కానీ నేను నిష్పక్షపాత విచారణను కోరుకుంటున్నాను’ అని స్పష్టం చేశారు. ‘నాలుగు నెలలుగా నాపై ప్రజలను రెచ్చగొట్టి కొత్తవారిని తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ ప్రభుత్వాన్ని గౌరవిస్తాను.. వారు తుపాకీని ఎక్కుపెడుతున్నారు.. నేను జైలులో ఉండాలని వారు అంటున్నారు’ అని ఆయన అన్నారు,


తన లోక్‌సభ సభ్యత్వం వినీష్ ఫోగట్ (నిరసనకు నాయకత్వం వహిస్తున్న రెజ్లర్) వల్ల రాలేదు ప్రజల మద్దతే కారణం అని పేర్కొన్నారు. ‘గ‌త 12 ఏళ్ల నుంచి రెజ్ల‌ర్లు నాపై ఏ పోలీసు స్టేష‌న్‌లో కూడా ఒక్క ఫిర్యాదు చేయ‌లేదు.. క్రీడా మంత్రిత్వ‌శాఖ‌కు కానీ, స‌మాఖ్య‌కు కానీ ఫిర్యాదు ఇవ్వలేదు.. నాలుగు నెలల కిందట ఆందోళనకు దిగడానికి ముందు ఆ రెజ్ల‌ర్లు నన్ను ప్రశంసించేవారు.. వారి వివాహ వేడుకలకు ఆహ్వానించేవారు.. నాతో ఫొటోలు దిగి, నా ఆశీర్వాదం తీసుకునేందుకు పోటీపడేవారు’ అని బ్రిజ్ వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa