రాష్ట్ర అభివృద్ధికి సీఎంగా చంద్రబాబుని గెలిపించుకోవడం రాష్ట్ర ప్రజలకు చారిత్రక అవసరమని, ఇందుకు టీడీపీ శ్రేణులు కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్లో భాగంగా స్థానిక వై జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక చెక్కానగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఎన్నో కుయుక్తులు పన్ని జనాలను మోసం చేసి కోడికత్తి, సొంత బాబాయిని హత్య చేయించి ఉపయోగించుకున్నాడన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా నాలుగేళ్లు పనిచేయడం వలన అభివృద్ధి జరగకపోగా ప్రజలకు తినడానికి తిండిలేకుండా పోయిందని ఆరోపించారు. రాజధాని అమరావతి, పోలవరం మరుగున పడ్డాయని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందక ఆందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్రానికి అప్పులు మిగిలాయని, అన్నింటి ధరలు, పన్నులు పెంచేశాడన్నారు. ఒక్కఛాన్స్ అంటూ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చింది ప్రజలను బాగుచేయడానికి కాదని ఆయన కుటుంబం బాగుపడ్డానికి, ఆస్తులు పెంచుకోవడానికేనని ఆరోపించారు. కేవలం మద్యం ద్వారానే జగన్రెడ్డి గల్లా పెట్టెకి వచ్చే నల్లధనం నెలకు రూ.850 కోట్లు వస్తోందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా, సంక్షేమం, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రజలు చంద్రబాబునాయుడుని రాష్ట్ర సీఎంగా గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపునకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధిపై వైసీపీ నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నానని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే అనిత సవాల్ విసిరారు. అంతకుముందు తమ అనుచరులతో టీడీపీలోకి చేరిన గొడవర్తి భాస్కరచౌదరి, ఉలబాల సతీష్బాబులకు అనిత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa