ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం,,జగనన్నకు చెబుదాం ప్రారంభించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 09:25 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాల అమలు చేస్తున్నామన్నారు జగన్. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని.. ఆ తర్వాత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని.. ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందన్నారు.


గత ప్రభుత్వ పాలనలో లంచాలు, వివక్ష ఉండేదని.. ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీది అని విమర్శించారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని.. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చే వారన్నారు. తన సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించానని.. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలన్నదే లక్ష్యమన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.


టోల్‌ ఫ్రీ నెంబర్‌-1902కు కాల్‌ చేస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని.. ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు పరిష్కారమవుతుందన్నారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని.. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వైఎస్సార్‌ ఐటీ కేటాయిస్తారన్నారు. ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు స్టేటస్‌పై ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు సీఎం.


ఎవరికైనా సమస్య ఉంటే.. వెంటనే 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. కాల్‌ సెంటర్‌ ప్రతినిధికి సమస్యను చెప్పగానే.. ఫిర్యాదును నమోదు చేసుకుని యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌ (YSR) ఐడీని కేటాయిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదుపై స్టేటస్‌ గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్‌డేట్‌ చేస్తారు. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పరిష్కారం అయ్యేలా ట్రాకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు.


రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ పథకాలు అందని పక్షంలో.. ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయొచ్చు. ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా 1902కు కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa