ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది,,, కౌలు రైతు ఆవేదన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 09:27 PM

‘‘వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఈ చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈయన చేసిన నాశనానికి కొంత మంది చచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో.. సర్వనాశనం చేశాడయ్యా మహానుభావుడు..! మాకు దరిద్రం పట్టించాడయ్యా.. మన రాష్ట్రానికి పట్టించాడు.. మా నియోజకవర్గానికి పట్టించాడు.’’ అంటూ ఓ కౌలు రైతు చెప్పుతో కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దామలూరులో చోటు చేసుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దామలూరులో పార్టీ నాయకులతో కలిసి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. అకాల వర్షాలకు తడిసిపోవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న కంకులను పరిశీలించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా ముందు కౌలు రైతు షేక్‌ గాలి సైదా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మా మైలవరానికి, మాకు దరిద్రం పట్టి నష్టపోయాం. మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఎక్కడ ఏసీలో పడుకున్నాడో మహానుభావుడు! ఆ బూడిద తోలుకుంటా, ఆ డబ్బులు పోగు చేసుకుంటా. ఆయన ముఖం టీవీలో కూడా చూడలేదు సార్‌ నేను. ఒక్క రోజైనా వడ్లు, మొక్కజొన్న కొనమని చెప్పారా? సార్‌.. (దేవినేని ఉమాను ఉద్దేశించి) మిమ్మల్ని ఓడించి తప్పు చేశాం’’ అంటూ కౌలు రైతు షేక్‌ గాలి సైదా తన చెప్పుతో చెంపలపై కొట్టుకున్నారు.


తాను 25 ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరానికి రూ. 60 వేలు (కౌలుతో కలిపి) పెట్టుబడి పెట్టి మొక్కజొన్న వేశానని షేక్ గాలి సైదా తెలిపారు. మంచి దిగుబడి వచ్చిందని కోత కోస్తే అకాల వర్షానికి తడిసి.. బూజు పట్టి, మొలకలు వచ్చి రంగు మారిందన్నారు. ఇప్పుడు ఈ పంట అమ్మితే ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు కూడా రాదన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే, ప్రభుత్వ మద్దతు ధరతో అమ్మితే ఎకరాకు రూ.75 వేలు చొప్పున వచ్చేదని సైదా ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు సమీక్షలకే పరిమితమయ్యారని, క్షేత్ర స్థాయిలో వారు పరిశీలన చేయడం లేదని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపితే సాగుదారులకు మంచి ధర వచ్చేదని చెప్పారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక లేదా అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa