మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో చీతా మృతిచెందింది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా దక్ష మంగళవారం మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పార్క్లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో దక్ష చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కునోలో 42 రోజుల వ్యవధిలో చీతా మరణించడం ఇది మూడో ఘటన కావడం గమనార్హం. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో సాశా అనే ఆడ చీతా ఈ ఏడాది మార్చి 27న అనారోగ్యంతో చనిపోయింది. భారత్కు రాకముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సాశా.. మరింత అస్వస్థతకు గురై మృతిచెందింది.
కొద్ది రోజుల అనంతరం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా.. ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయినట్లు కునో జాతీయ పార్కు చీఫ్ కన్జర్వేటివ్ అధికారి జేఎస్ చౌహాన్ తెలిపారు. తాజాగా, ఆడ చీతా దక్ష, వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలు ఘర్షణ పడ్డాయి. ఈ సమయంలో తీవ్రంగా గాయపడిన దక్ష ప్రాణాలు విడిచింది. సంభోగం ప్రయత్నాల సమయంలో దక్షతో హింసాత్మక పరస్పర చర్య మరణానికి దారితీసిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
దక్ష గాయాలతో ఉన్న విషయాన్ని ఉదయం 10.45 గంటల సమయంలో గుర్తించిన కునో నేషనల్ పార్కు సిబ్బంది.. హుటాహుటిన వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ రెండు గంటల తర్వాత దక్ష మృతిచెందినట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. సంభోగం సమయంలో ఆడ చీతాల పట్ట మగ చిరుతల ఇటువంటి ప్రవర్తన సర్వసాధారణమని, పర్యవేక్షణ బృందం జోక్యం చేసుకోవడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని అధికారి తెలిపారు.
దేశంలో అంతరించిపోయిన చిరుతలను మళ్లీ ప్రవేశపెట్టడానికి సుప్రీంకోర్టు 2020లో అనుమతించింది. దీంతో గతేడాది సెప్టెంబరులో తొలి విడతగా 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చారు. ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు. ఈ 20లో ఇప్పటి వరకూ 3 చనిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa