ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌కు పుట్టిన సంతానం ఎవరూ ఆయన వారసులు కాదు: లక్ష్మీపార్వతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 08:42 PM

ఎన్టీఆర్‌కు పుట్టిన సంతానం ఎవరూ ఆయన వారసులు కాదని లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు పుట్టిన సంతానం ఎవరూ ఆయన వారసులు కాదని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌కు కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూనే నిజమైన వారసుడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు, నోట మాట సరిగా రాని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని ఎన్టీఆర్ రాజకీయ వారసుడని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్లు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.


సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారని లక్ష్మీపార్వతి తెలిపారు. దారుణంగా మోసం చేసిన చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని ఆనాడు ఎన్టీఆర్ తీర్మానం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా లేదని ఫైరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు కష్టకాలంలో అండగా నిలబడ్డ దేవినేని నెహ్రూ నిజమైన వారసుడని.. ఇక, సంబంధం లేకపోయినా గౌరవంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసలు కురిపించారు. ఒక సామాజిక వివక్ష నుంచి కాపాడి తన గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇక, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.


అలాగే, ఇంత అద్భుతంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని లక్ష్మీపార్వతి అన్నారు. అప్పట్లో తన గొంతు వినిపించకుండా మీడియా అడ్డుకుందని.. కానీ, ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల తన గొంతును ఇంత మంది వింటున్నారని పేర్కొన్నారు. ఈ శతాబ్దం ఎన్టీఆర్‌దని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa