ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్తితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 08:41 PM

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్తితిపై గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. లక్ష్మి 26వ తేదీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్స్‌లో చేరారని, యాంజియోగ్రామ్ తర్వాత కర్నూలులోని ఆసుపత్రి నుంచి గచ్చిబౌలి ఏఐజీ హాస్పటల్‌కు రిఫర్ చేశారని బులిటెన్‌లో తెలిపారు. కరోనరీ యాంజియోగ్రామ్ రెండు నాళాల వ్యాధిని ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కుడి కరోనరీ ఆర్టరీకి కట్టింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ ప్లేస్‌మెంట్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఐసీయూలో కోలుకుంటున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఏఐజీ డాక్టర్లు వెల్లడించారు.


తొలుత కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో లక్ష్మి చికిత్స పొందారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసిన అక్కడి వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. గత వారం రోజులుగా అవినాష్ రెడ్డి హాస్పిటల్‌లోనే తల్లి వద్ద ఉన్నారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి బయటికి వచ్చి తల్లితోపాటు హైదరాబాద్‌కు వచ్చారు. సీబీఐ బృందాలు విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకోవడంతో దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఆస్పత్రి వద్దకు అవినాష్ రెడ్డి అనుచరులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. హాస్పిటల్ ముందు బైఠాయించడంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.


అటు వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్‌లో అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అవినాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం.. హైకోర్టును సంప్రదించాలని సూచించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం తుది తీర్పు వెల్లడిస్తామని, అప్పటివరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐను ఆదేశించింది. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీబీఐ బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టుల సూచించింది. హైకోర్టులో అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించగా.. సునీత తరపున న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రవిచంద్ తన వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు లాయర్ కూడా తమ వాదనలు వినిపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa