ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం,,,,ఆధునిక దేవాలయమన్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:23 PM

దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్వీకర్‌ ఓంబిర్లాతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనంలో తొలి ప్రసంగం చేశారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని, కొత్త పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ఆధునిక దేవాలయమని మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నామని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు.


దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయని, అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది కేవలం భవనం కాదని, 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలలకు ప్రతీక అని చెప్పారు. ప్రపంచానికి భారత్‌ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్తభవనం ఇస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఇది నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. నవ భారత్‌ కొత్త మార్గాలు నిర్దేశించుకుని.. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్‌ ప్రగతి పథాన పయనిస్తోందని చెప్పారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని ప్రధాని వివరించారు.


ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతోందని అన్నారు. సేవ, కర్తవ్యానికి ప్రతీక అయిన పవిత్రమైన సెంగోల్ (రాజదండం) ను పార్లమెంట్‌లో ప్రతిష్ఠించామని వెల్లడించారు. చోళ సామ్రాజ్య చరిత్రలో సెంగోల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు చిరస్థాయిగా మారతాయని, మే 28 కూడా అలాంటి రోజు అని ప్రధాని ఉద్ఘాటించారు.


‘‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి.. పునాది కూడా. ప్రజాస్వామ్యమే మన ఆలోచన, సంప్రదాయం’’ అని తెలిపారు. ఎన్నో ఏళ్ల విదేశీ పాలన మన ఆత్మగౌరవాన్ని మన నుంచి దూరం చేసిందని, నేడు భారతావని ఆ వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకుందని అన్నారు. ‘కొత్త పార్లమెంటు అవసరం ఉంది.. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మనం గుర్తించాలి.. అందుకే కొత్త పార్లమెంటును నిర్మించాల్సిన పని పడింది’ అని ప్రధాని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం దేశంలోని అనేక సంస్కృతుల సమ్మేళనం అని పేర్కొన్నారు.


ఇక్కడ జరిగే నిర్ణయాలు భారత్ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, తాడిత, పీడిత ప్రజలకు న్యాయం జరుగుతుందని మోదీ ఆకాక్షించారు. భారత్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత పలువురు నేతలతో ప్రధాని ముచ్చటించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ తదితరుల దగ్గరకు ముచ్చటించారు. అంతకుముందు రూ.75 నాణెం, స్టాంప్‌ను విడుదల చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa