మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో రెజ్లర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులకు పైగా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. నూతన పార్లమెంట్ భవనం వద్ద మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించేందుకు బయలుదేరిన రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రోజే.. రెజ్లర్లు పార్లమెంట్ భవనం వరకూ ప్రదర్శనకు పిలుపు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ భవనం వైపు వెళ్లేందుకు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మహిళా రెజ్లర్ల ఆందోళనకు రైతులు, పలు రాష్ట్రాల ఖాప్ పంచాయత్ నేతలు మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ భవనం వరకూ ప్రదర్శన చేపట్టేందుకు బయలుదేరిన భజరంగ్ పూనియానూ అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా భజరంగ్ పూనియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్న రోజే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జంతర్ మంతర్ నుంచి నూతన పార్లమెంట్ భవనం వరకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని రెజ్లర్లు ఆరోపించారు. తమ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం వద్దకు రెజ్లర్లను అనుమతిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రెజ్లర్ల పిలుపుతో వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు, ఖాప్ పంచాయతీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. అయితే వీరిని ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లోనే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఘాజీపూర్, సిక్రీ, అంబాలా, సింఘూ సరిహద్దుల్లోనే బారికేడ్లు పెట్టి.. ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా నిలువరించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలు నెల రోజులు దాటాయి. తమపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - డబ్లూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేసే వరకు తమ ఆందోళనలు విరమించేది లేదని తేల్చిచెప్పారు. తాజాగా వీరికి యోగా గురు బాబా రాందేవ్ మద్దతు పలికారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa