ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు, సైన్యం కాల్పుల్లో మణిపూర్ లో 40 మంది తిరుగుబాటుదారులు హతం

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:25 PM

మణిపూర్‌లో తిరుగుబాటుదారులను భద్రతా బలగాల సాయంతో అణిచివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పింది. నిరాయుధులైన పౌరులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న 40 మంది తిరుగుబాటు దారులు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయతోపాటు మరో 5 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ చేపట్టారు. అత్యాధునిక ఆయుధాలతో పౌరులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రజలు కూడా చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇంఫాల్ లోయ దాని చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రాంతాలపై తిరుగుబాటు దారులు ఒకేసారి దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మాయ్, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెక్మాయ్ వద్ద కాల్పులు ముగిశాయని.. సంబంధిత వర్గాలు తెలిపాయి.


తిరుగుబాటుదారుల మారణకాండను అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 8 గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి 40 మంది తిరుగుబాటు దారులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. M-16, ఏకే-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్‌లు వంటి అత్యాధునిక ఆయుధాలను తిరుగుబాటు దారులు ఉపయోగించినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఇళ్లను తగలబెట్టేందుకు ఆ మూకలు ప్రయత్నించాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, సైన్యం సాయంతో.. వారిని మట్టుబెట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు.


గాయపడిన పౌరులను రాజధాని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫాయెంగ్‌ ప్రాతంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బిషెన్‌పూర్‌లోని చందోన్‌పోక్పిలో జరిగిన కాల్పుల్లో ఓ రైతు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అతని మృతదేహాన్ని ఇంఫాల్ లోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో మరింత మంది పౌరులు చనిపోయినట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.


కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను పాటించాలని.. పరిస్థితిని సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఇప్పటికే కుకీ తెగకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. శనివారం అక్కడికి చేరుకున్నారు.


మణిపూర్‌లోని ఇంఫాల్ లోయ ప్రాంతంలో రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 90 శాతం మంది ప్రజలు నివసిస్తారు. ఇక్కడ మెయితీ వర్గం వారు అత్యధికంగా నివసిస్తారు. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల్లో 40 సీట్లు అక్కడి నుంచే ఉండటంతో రాజకీయంగానూ వారికి బలమైన పట్టు ఉంటుంది. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాతోపాటు 30 రకాల ఆదివాసీ తెగలున్నాయి. మెయితీలకు కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు అనుమతి లేదు. కానీ కొండ ప్రాంతాల్లో ఉన్న వారు లోయలో భూములు కొనడానికి అనుమతి ఇచ్చారు. మెయితీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా.. వారికి ఇవ్వొద్దని గిరిజన తెగలైన నాగా, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 70 మందికి పైగా మృత్యువాత పడగా.. వందలమంది గాయపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa