‘‘విజయవాడ టీడీపీ పార్లమెంట్ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానేమో’’ అని విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బాలుర హైస్కూల్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు. ‘‘అభివృద్ధి వేరు పార్టీలు వేరు. రాష్ట్రంలో రెండు రాజకీయ వేదికలు మాత్రమే ఉన్నాయి. ఒకటి చంద్రబాబు, రెండోది జగన్, విరోధాలు వారిద్దరి మధ్య తప్పితే మామధ్య(వైసీపీ నేతలతో) ఏం లేవు’’ అని నాని వ్యాఖ్యానించారు. ప్రాంతాల అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తానని చెప్పారు. విజయవాడ అభివృద్ధే తన ధ్యేయమని, 2019లో అన్ని పార్టీల వాళ్లు తనకు ఓట్లు వేయడం వల్లే గెలిచానన్నారు. పది సార్లు ఎంపీగా చేయాలనే కోరిక తనకు లేదన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో తమ ఇద్దరి బాట ఒక్కటేనన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి మాత్రమేనని అన్నారు. నిధుల కోసం టీడీపీ, బీజేపీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడానన్నారు. నానీతో పాటు కనకమేడల రవీంద్రకుమార్, సుజనాచౌదరిలను తాను కలిసినట్టు చెప్పారు. నానీ తాత, తన తండ్రి మంచి స్నేహితులని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa