రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పూర్తిగా బ్రేక్ పడిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళుతోన్న బీజేపీ దేశానికి ప్రధాని చేసిన సేవ, అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై 50 లక్షల కరపత్రాలను ముద్రించింది. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వాటిని ఆవిష్కరించిన సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలోని హామీలన్నీ మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. పోలవరం, రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయడం చేత కావట్లేదు. పోలవరాన్ని వరదకు వదిలేసి, మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసి పూర్తిగా తిరోగమనంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. కేంద్రం అభివృద్ధి ప్రాజెక్టులకు ముందుకొచ్చినా వాటికి స్థలాలు ఇవ్వలేని దారుణమైన స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఎవరు చర్చకొచ్చినా నేను సిద్ధం. బీజేపీ–జనసేన పొత్తులోనే ఉన్నాయి. ఇతర విషయాలు మా పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందక పోయినా అభివృద్ధి, సంక్షేమానికి నిధులు ఇస్తూనే ఉంటుంది. ఈ నెల 20 నుంచి ప్రజల్లోకి కరపత్రాలతో వెళతాం. బీజేపీని వారికి దగ్గర చేసేందుకు కృషి చేస్తాం’’ అని సుజనా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa