పాదయాత్ర చేస్తున్న లోకేశ్పై వైసీపీ మూకలు కోడిగుడ్లతో దాడి చేయడం గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్ మీదుగా కొత్తపల్లి పీఎన్ఆర్ ఎస్టేట్ వద్ద విడిదికేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసీపీ కార్యకర్త లోకేశ్పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్కుమార్రెడ్డిని, లోకేశ్ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేశ్ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం. మూడ్రోజులుగా వైసీపీవారే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత కల్పించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? మీ కథ తేలుస్తా’ అని హెచ్చరించారు. తర్వాత కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ అక్కడే కాసేపు బైఠాయించి రాత్రి 10.30 గంటలకు విడిది కేంద్రానికి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa