ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదానికి గురైన వారందరినీ తీసుకొస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 07:56 PM

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందన్నారు. ఈ ప్రమాదం రాష్ట్రానికి చెందిన ఎవరైనా గాయపడ్డా, చనిపోయినా.. వారిని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశాకు పంపించామన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 482 మంది తెలుగు వారు ప్రయాణించినట్లు తమకు సమాచారం అందిందని.. వారి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అయితే, 76 మంది వివరాలు ఇంకా ట్రేస్ కాలేదని చెప్పారు. యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 89 మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నారని, ఆ 89 మందితోనూ అధికారులు మాట్లాడుతున్నారని వివరించారు.


అలాగే, అన్ని కలెక్టరేట్లలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని మంత్రి బొత్స వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ఇచ్చాపురం నుంచి బోర్డర్‌లో ఉన్న అన్ని ఆస్పత్రులను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్, మొత్తం 65 అంబులెన్స్‌లను పంపించామని చెప్పారు. ఎయిర్‌పోర్టులో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవీ సహకారం కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఈ రైలు ప్రమాదంలో.. ఇప్పటి వరకు ఏపీ నుంచి ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొందరు గాయపడినట్లు మాత్రమే తమకు సమాచారం అందిందని వెల్లడించారు.


ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గంటకు సమీక్షిస్తున్నారని, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వారికి ఒడిశాలోనూ ట్రీట్మెంట్ అందించేందుకు గాను అన్ని చర్యలు చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.


ఇదిలావుంటే  శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే! షాలిమార్- చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పట్టాలు తప్పడంతో.. అవి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అనంతరం బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన ఆ కోచ్‌లను ఢీకొట్టడంతో దీని కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో గూడ్సు రైలు కూడా చిక్కుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 290 మందికి పైగా మృతి చెందగా, 1,000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa