ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంలో దిగాల్సి ఉన్న 110 మంది ప్రయాణికులు,,,స్విచ్ఛాఫ్‌ అయిన చాలా మంది బాధితుల మొబైల్ ఫోన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 07:56 PM

ఒడిశాలో ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ ఏపీకి చెందిన ప్రయాణికులు 200 మందికిపైగా ఉన్నారని అధికారవర్గాల సమాచారం. రిజర్వేషన్ వివరాల ఆధారంగా వివిధ స్టేషన్లలో ఎక్కిన, దిగాల్సిన ప్రయాణికులు మొత్తం 122 మంది ఉన్నారు. ఇందులో కొంతమంది క్షేమంగా ఉన్నట్లు తమ కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, చాలా మంది వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. వారి ఫోన్లు కలవడంలేదని కొంతమంది, స్విచ్ఛాప్ అని వస్తోందని చెబుతున్నారు. దీంతో తమ వారికి ఏం జరిగిందోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.


ఈ నేపథ్యంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లలో హెల్స్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికుల వివరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని అదేశించారు. సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని అక్కడకు పంపారు.


యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుపతి స్టేషన్‌లో 18 మంది, చీరాలలో 12 మంది, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, బాపట్ల స్టేషన్లలో ఇద్దరు చొప్పున, బెజవాడలో నలుగురు, రేణిగుంటలో 8 మంది ప్రయాణికులు ఎక్కారని రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 52 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు.


షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్‌కు వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో సుమారు 170 మంది ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఉన్నట్లు రిజర్వేషన్ వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఈ సంఖ్య ఎక్కువే ఉన్నట్టు సమాచారం. ఫస్ట్ ఏసీలో 9, సెకెండ్ ఏపీ 17, థర్డ్ ఏసీ 117, స్లీపర్‌లో 38 మంది ఎక్కినట్టు అధికారులు తెలిపారు. ఈ రైలు ఎక్కినవారిలో విశాఖపట్నంలో 110, రాజమండ్రి 26, తాడేపల్లిగూడెం 1, ఏలూరు 2, విజయవాడలో 39 మంది దిగాల్సి ఉంది. ఇదే రైలులో చెన్నై సెంట్రల్‌కు ప్రయాణించేందుకు రాజమండ్రి నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రమాదం జరగడంతో వీరి ప్రయాణం రద్దయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa