ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు వస్తున్నా గేటు వేయని సిబ్బంది.,,,తప్పిన పెను ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 07:55 PM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కూటగుళ్ల రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయానికి గేట్‌మెన్ గేటు వేయలేదు. దీంతో వాహనాలు రైల్వే క్రాసింగ్ మీదుగా అటూ ఇటూ యథేచ్చగా తిరిగాయి. ఇంతలో అటు వైపు ఓ రైలు వచ్చింది. రైలు రాకను గమనించి కొంత మంది వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. ఇరువైపులా ఉన్న వారిని హెచ్చరించారు. ఇదే సమయంలో ట్రైన్ లోకో పైలట్‌ కూడా అక్కడ గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం (జూన్ 2) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.


చెన్నై హైవేకు సమీపంలో ఉన్న ఈ రైల్వే క్రాసింగ్ వద్ద ఎప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. రైలు వచ్చే సమయంలో రైల్వే గేట్ వద్ద సిబ్బంది ఎవరూ లేరు. నిలిపివేసిన రైలు ఇంజిన్ నుంచి రైల్వే సిబ్బంది ఒకరు కిందకి దిగివచ్చి గేటు వద్ద కార్యాలయంలో పనిచేశారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఎవరూలేరని ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. గేట్ వద్ద ఓ వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడని.. తాను వచ్చేసరికి అతడు కూడా లేచి పారిపోయాడని ఆయన ఫిర్యాదు చేశారు.


ఈ ఘటనతో హైవే వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఒడిశాలో రైలు దుర్ఘటన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. భారతీయ రైల్వే చరిత్రలో అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాద ఉంది. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి రావాల్సిన 178 మంది ప్రయాణికులు ఆచూకీ తెలియాల్సి ఉంది.


బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో.. షాలిమార్‌ - చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైలు ఓకే లైన్‌లోకి వచ్చి పరస్పరం ఢీకొట్టుకున్నాయి. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను 15 నిమిషాల వ్యవధిలో బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు - హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 110 కి.మీ. వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో బోగీలు చిన్నాభిన్నమై ఘోరం జరిగిపోయింది. మానవ తప్పిదం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు, నిపుణులు ఆరోపిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa