ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. తాడేపల్లి నుంచి వెళ్లిన సీఎం.. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. దిగువ కాఫర్ డ్యాం దగ్గర పూర్తైన పనులను సీఎం జగన్ పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్ వాల్.. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం జగన్ తిలకిస్తున్నారు. వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పోలవరం పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ప్రాజెక్టు పనుల్లో సహజంగానే చిన్న, చిన్న సమస్యలు వస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా రాష్ట్రంలో ఉందన్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారన్నారు సీఎం. ఈ ఖాళీల నుంచి వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈఎస్ఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందన్నారు. దీని వల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు.. రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం ఆ మీడియాకు కనిపించలేదన్నారు.
డయాఫ్రం వాల్ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు సీఎం. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు అధికారులు.
పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్లో పరిశీలించిన సీఎం జగన్
పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని.. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటు కూడా చర్యలు తీసుకోవాలని.. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది. కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తైంది. మరోవైపు పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేరకు నిధులకు ఓకే చెప్పింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa