కర్నాటక సర్కార్ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నప్పుడు.. కాసేపటి తర్వాత ఆడవాళ్లు వచ్చి.. ఇది లేడీస్ సీటండీ.. మీరు కాస్త లేవండి అనడం చాలా మందికి అనుభవమే. ప్రతి ఆర్టీసీ బస్సులో నిర్దేశించిన మొత్తంలో సీట్లను ఆడవాళ్లకు కేటాయించడమే దీనికి కారణం. ఆడవాళ్లకు కేటాయించిన సీట్ల వెనుక ‘స్త్రీలను గౌరవిద్దాం.. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం’ అనే కొటేషన్ సైతం రాసి ఉంటుంది. మహిళలు ఎక్కువ సేపు నిల్చోలేరని.. వారిని ఇబ్బంది పెట్టొద్దనేది దీని వెనకున్న ఉద్దేశం. కానీ ఇప్పుడు కర్ణాటకలో మాత్రం పరిస్థితి మారిపోయింది. అక్కడ పురుషులకు బస్సుల్లో 50 శాతం సీట్లను కేటాయిస్తున్నారు. మగాళ్లకు మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా..? అది మగాళ్ల మీద ప్రేమ కాదులేండి.. ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోకుండా.. మగాళ్లకు కోపం రాకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్య.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం హస్తం పార్టీ ఓటర్లకు అనేక హామీలు గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది.
జూన్ 11న కర్ణాటక వ్యాప్తంగా ఈ పథకం మొదలైంది. దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కానీ ఆర్టీసీకి మాత్రం నష్టాలు రావడం ఖాయంగా ఉంది. దీంతో మగాళ్లు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేస్తు్న్నారు కాబట్టి.. బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
మన దగ్గర ఆర్టీసీ బస్సుల సీట్ల వెనుక ఈ సీటు స్త్రీలకు కేటాయించబడింది.. అని రాసినట్లు ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో.. పురుషులకు కేటాయించిన సీట్లకు స్టిక్కర్లను అతికిస్తారట. బస్సులో పురుషులు లేకుంటే.. ఆ సీట్లు ఖాళీగా ఉంటే మహిళలు వాటిలో కూర్చోవచ్చు. కానీ ఒకవేళ పురుషులు వస్తే మాత్రం ఆ సీటును ఖాళీ చేసి వారిని కూర్చోనివ్వాలి. భలే ఉంది కదూ..!
కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేకేఎస్ఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్డబ్ల్యూఎస్ ఆర్టీసీ)ల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,220 కోట్లు అవసరమని అంచనా. అంతే కాదు.. కర్ణాటక ఆర్టీసీ కొత్తగా 4 వేలకుపైగా బస్సులను సమకూర్చుకోవడంతోపాటు.. దాదాపు 14 వేల మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa