కృష్ణా జిల్లా పామర్రు వీఆర్వో మీనాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పొగడ్తలు కురిపించారు. 'ఈ సోదరి ధైర్య సాహసాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అధికారుల్లో ఎంతో మంది జగన్ రెడ్డికి భయపడి ఇసుక, మట్టి, మైనింగ్ లాంటి అనేక మాఫియాలకు సహకరిస్తుంటే.. ఒక మహిళ.. చేతిలో 10 నెలల చంటి బిడ్డను పెట్టుకుని.. బైక్ మీద వెళ్లి మండుటెండలో మాఫియాను అడ్డుకోవడం మాటలు కాదు ' అన్నారు లోకేష్.
'కృష్ణాజిల్లా, పామర్రు మండలం, పసుమర్రు పరిధిలో ఇసుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకుని సీజ్ చేసిన విఆర్ఓ మీనా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విధి నిర్వహణలో మీ నిబద్ధతకు వందనాలు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మీ చర్య ఆదర్శం కావాలి' అంటూ ట్వీట్ చేశారు.
కొంతకాలంగా పసుమర్రు సమీపంలో అనుమతులు లేకుండా మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వుతున్నట్లు సమాచారం వచ్చింది. ఆ మట్టిని లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారని వీఆర్వో మీనాకు సమాచారం అందింది. ఆమెకు 10 నెలల బిడ్డ ఉన్నాడు.. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అలాగే తన బిడ్డను నడుముకు కట్టుకుని లారీని అడ్డుకోవడానికి స్కూటీపై వచ్చారు. ఆ మట్టి మాఫియా లారీలను ఆపి సీజ్ చేశారు.. వారికి ఫైన్ విధించారు. చేతిలో పిల్లవాడు ఉన్నా సరే.. ఎంతో ధైర్యంగా మైనింగ్ మాఫియాను అడ్డుకున్నారని.. విధి నిర్వహణలో ఆమె ధైర్యం, నిబద్ధతపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
వీఆర్వో మీనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంటి బిడ్డను వెంట తీసుకెళ్లి మట్టి మాఫియాను అడ్డుకున్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మైనింగ్ మాఫియా చాలా ప్రమాదకరం.. ఎవరు అడ్డొచ్చినా ఊరుకోరు. వారిని అడ్డుకోవాలని చూస్తే చంపేసేందుకు వెనుకాడరు. గతంలో కూడా చాలా సంఘటనలు కూడా జరిగాయి. ఆమె మాత్రం ఏమాత్రం భయపడకుండా మట్టి మాఫియా ఆటకట్టించారు. వీఆర్వో సాహసానికి నెటిజన్లు కూడా హ్యట్సాఫ్ అంటున్నారు.. గ్రేట్ అంటూ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో మీనా ట్రెండ్ అయ్యారు.. ఆమె ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో నారా లోకేష్ స్పందించారు.. మీనాపై ప్రశంసలు కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa