జగన్, చంద్రబాబుపై మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకముందే.. ఏపీ గురించి మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కూడా అదే రకంగా కామెంట్లు చేసి.. మరో వివాదానికి తెరలేపారు. ఇద్దరు నేతల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బొక్కబోర్లా పడిందంటూ.. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగానే కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అని.. కేసీఆర్ది మాత్రం చేతల ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఓ సీఎం ఉండేవారని.. ఆయన హైటెక్.. హైటెక్.. అంటే, మరొకరు మాట్లాడితే సుపరిపాలన అంటూ హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరి వల్లే ఏపీ పరిస్థితి ఈరోజు ఇలా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి హరీశ్ రావు పాల్గొ్న్నారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లి చూస్తే కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అయినా మంచి పాలన అందించి.. తెలంగాణ ప్రజలను తలఎత్తుకునేలా చేశారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తోన్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందంటే.. ఎంత మంచి పాలన అందజేస్తున్నామో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
తెలంగాణ వస్తే మళ్లీ నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్ మొత్తం కర్ఫ్యూతోనే ఉంటుందని.. రాష్ట్రమంతా చీకటిమయం అవుతుందంటూ.. చాలా మంది భయపెట్టారని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ 9 ఏళ్లలో అది ఏమాత్రం నిజం కాదని సీఎం కేసీఆర్ చేసి చూపెట్టారని తెలిపారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని.. అందుకు కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనమన్నారు. రాష్ట్ర ఏర్పాటును అప్పుడు అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు తెలంగాణ అభివృద్ధే చెంపపెట్టన్నారు. తెలంగాణ విభజనను అప్పుడు వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి రాజ్గోపాల్ అన్నట్టు గుర్తని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోనే లేరని.. నవ్విన నాప చేనే పండుతుందన్నట్టు.. తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa