రాష్ట్రంలో చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థకు, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్దం జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా చేసి వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్ జగన్. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థకు, పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. దోచుకో, పంచుకో, తినుకో భావజాలానికి, లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్కు జరుగుతున్న యుద్ధంగా వ్యాఖ్యానించారు. సామాజిక అన్యాయానికి.. సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. విష ప్రచారానికి, ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ఇది జగన్పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. జగన్కు మీడియా, దత్తపుత్రుడు తోడు లేరన్నారు. 'మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు' అన్నారు.
జగన్ నమ్ముకుంది దేవుడి దయను.. ప్రజల చల్లని దీవెనలు మాత్రమే అన్నారు. 'నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా' అన్నారు. రాష్ట్రంలో జరిగే దుష్ప్రచారాలను నమ్మొద్దని.. ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోవాలన్నారు. ఇంట్లో మంచి జరిగితే అండగా నిలబడాలని.. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతాను అన్నారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని.. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రజలు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించాలని.. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నామని.. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు మాత్రం మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోట్లు అంటూ మండిపడ్డారు. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్గా వండుతున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం సభలో విద్యార్థుల థ్యాంక్యూ జగన్ మామా ప్లకార్డులు
సీఎం అయిన 28 ఏళ్ల తర్వాత.. 14 ఏళ్ల పాటూ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవాళ మొదలుపెట్టారని విమర్శించారు. ఆ 14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదన్నారు. పేదపిల్లలకు ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదన్నారు. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించారని.. అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని ధ్వజమెత్తారు.
పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు విద్యాకానుక అందిస్తున్నామన్నారు సీఎం. కిట్లలో మార్పులు తెచ్చామని.. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామన్నారు. ఈ విద్యాకానుక పథకం మీదే ఈ నాలుగేళ్లలో అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామన్నారు. టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టామని.. అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ అందిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa