కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న తెలుగు, ఇంగ్లీష్ టీచర్లకు ప్రభుత్వం పిడుగు లాంటి వార్త చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభంకాగానే ‘మీ సేవలు చాలు. ఇక ఇంటికి వెళ్లండి’ అంటూ ఉద్యోగం పోయిందన్న విషయాన్ని స్పష్టంచేసింది. దీంతో ఐదేళ్లు ఇక్కడ పనిచేసి ఇప్పుడు అకస్మాత్తుగా వద్దంటే ఎక్కడికి వెళ్లాలంటూ రాష్ట్రవ్యాప్తంగా 160 మంది టీచర్లు లబోదిబోమంటున్నారు. పదో తరగతి వరకు మాత్రమే ఉండే కేజీబీల్లో 2018-19లో ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. అప్పట్లో ఇంటర్వ్యూల ద్వారా 160 మందిని తీసుకుని వారికి రూ.12వేల జీతం ఇస్తున్నారు. తమకు జీతాలు తక్కువగా ఇస్తున్నారని ఆందోళన చేయడంతో జీతాలను రూ.26వేలకు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈలోగా ఇంటర్కు బోధించేవారిలో గ్రూపు సబ్జెక్టుల టీచర్లు చాలని, భాషా సబ్జెక్టుల టీచర్లు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారి కొలువులకే ఎసరు వచ్చింది. కాగా, తమ ఉద్యోగాలు కొనసాగించాలంటూ కేజీబీవీ పీజీటీలు గురువారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.బాలకాశీ, ఉపాధ్యక్షుడు కె.విజయ్ నేతృత్వంలో సుమారు 50 మంది టీచర్లు ఇందులో పాల్గొన్నారు. సమగ్రశిక్ష కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చివరికి కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు అక్కడికి వచ్చి కొత్త నోటిఫికేషన్ భర్తీ అనంతరం సర్దుబాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa