రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు చూసి మహానాడులో మేనిఫెస్టో విడుదల చేశాం అని చెప్పారు. పేదలను ధనికులను చేయడం అనేది తన సంకల్పం అని వివరించారు. దానిపైనా విమర్శలు చేస్తున్నారని, గతంలో హైదరాబాద్ లో చేసిన అభివృద్దితో అక్కడ పరిస్థితులు మారలేదా... ఇదీ కూడా అలాగే సాకారం చేస్తానని చెప్పారు. అప్పులు చేసుకుంటూ పోవడం గొప్ప విషయం కాదని, సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు, ఏపీకి మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం రూ. 40 వేల కోట్లు ఉందని... టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ నష్టం ఉండేది కాదు అన్నారు. ఇలా వచ్చిన సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చెప్పారు.
2014 తరువాత 5 ఏళ్లలోనే ఎంతో అభివృద్ది చేశామని, మధ్యలో ఓటమి లేకుండా తెలుగుదేశం గెలిచి ఉంటే రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఊహించండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ది ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది వాస్తవమేనని, దీని వల్ల కూడా నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు.
పవన్ కల్యాణ్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే వైసీపీ నేతలు, మంత్రులు పనిగా పెట్టుకున్నారని మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa