తమిళనాడులోని డీఎంకే నేతృత్వంలోని స్టాలిన్ ప్రభుత్వం.. సంపూర్ణ మద్యపాన నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్ 22 ( గురువారం ) నుంచి లిక్కర్ షాప్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ బుధవారం వెల్లడించింది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా తొలి విడతలో ఈ 500 దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా తొలి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు టాస్మాక్ వెల్లడించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ రాష్ట్రంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించింది. ఈ హామీలో భాగంగానే ముఖ్యమంత్రిగా స్టాలిన్ అధికారంలోకి వచ్చాక తమిళనాడు మద్యం విధానంలో కీలక మార్పులు చేశారు.
తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా సెంథిల్ బాలాజీ కొన్ని నెలల కింద బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే ఏప్రిల్ నెలలోనే మద్యం దుకాణాల మూసివేతపై అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటన చేశారు. ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో సెంథిల్ బాలాజీ చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 2023 మార్చి 31 నాటికి 5329 రీటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో తొలి విడతలో 500 దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం గుర్తించినట్లు ఏప్రిల్ 12న సెంథిల్ బాలాజీ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20న ఇచ్చిన జీవోను ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ - టాస్మాక్ గుర్తు చేసింది. ఈ జీవో ఆధారంగా చేసుకునే 500 రీటైల్ మద్యం దుకాణాలను గుర్తించి జూన్ 22 నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మద్యం దుకాణాలు మూసివేస్తూ స్టాలిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పట్టాలి మక్కల్ కచ్చి -పీఎంకే పార్టీ స్వాగతించింది. తమిళనాడులో మిగిలి ఉన్న మద్యం దుకాణాలను కూడా గడువు లోగా మూసివేయాలని విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa