ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యారక్‌లో రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడుతోన్న ఖైదీలు,,,ఆపే ప్రయత్నం చేయడంతో వార్డర్‌పై దాడి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 09:35 PM

హరియాణాలో ఘోరం చోటు  చేసుకొంది.  రెండు వర్గాల ఖైదీల మధ్య జరుగుతోన్న ఘర్షణను నిలువరించడానికి ప్రయత్నించిన జైలు వార్డర్‌‌పైనే కొందరు దాడికి పాల్పడ్డారు. గొడవను ఆపే ప్రయత్నం చేసిన వార్డర్‌పై ఖైదీలు స్క్రూడ్రైవర్లతో ఖైదీలు దాడిచేసిన ఈ ఘటన హరియాణాలోని అంబాలా సెంట్రల్ జైలులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వార్డర్ అరుపులు విని అక్కడకు పరుగెత్తుకొచ్చిన మిగతా జైలు సిబ్బంది వారి బారి నుంచి ఆయనను రక్షించారు. ఈ ఘటనపై జైలు సిబ్బంది బల్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసుల కథనం ప్రకారం.. అంబాలా సెంట్రల్ జైలు బ్లాక్-5 బ్యారక్ ఇంఛార్జి రమేశ్ సింగ్.. మంగళవారం సాయంత్రం ఖైదీలను లెక్కించడానికి వెళ్లారు. బ్యారక్ గేటు తెరిచేసరికి రెండు గ్రూపులుగా విడిపోయి ఖైదీలు ఘర్షణ పడుతున్నారు. దీంతో గొడవలో జోక్యం చేసుకుని, వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో హత్యాయత్నం కేసులో ఆరు నెలల కిందట అరెస్టయిన ఖైదీల్లో ఓ వ్యక్తి, అతడి అనుచరులు చిన్న స్క్రూడ్రైవర్లతో దాడి చేసి పొడిచి చంపడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకుంటూ రమేశ్ సింగ్ ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు.


ఈ అరుపులు విన్న మిగతా బ్యారక్స్‌లోని జైలు సిబ్బంది అక్కడకు తక్షణమే చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో రమేశ్ సింగ్‌కు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. అయితే, సకాలంలో సిబ్బంది రావడం వల్ల త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఈ ఘటనలో 10 మందిపై కేసు నమోదుచేసినట్టు బల్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి తెలిపారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా? స్క్రూడ్రైవర్లు వీరికి ఎక్కడ నుంచి వచ్చాయి? అనేది దర్యాప్తులో వెల్లడవుతుందని పేర్కొన్నారు. విచారణ మొదలుపెట్టామని ఆయన వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa