ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకనైనా పనితీరు మెరుగుపర్చుకోండి.. ఆ ఎమ్యెల్యేలకు జగన్ హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 09:36 PM

పనితీరు బాగులేని ఎమ్మెల్యేలకు  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పనితీరులో 15 మంది ఎమ్మెల్యేలు బాగా వెనకబడ్డారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇకనైనా పని తీరు మెరుగుపరచుకోవాలని.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు.


గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకమని.. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని.. 175కి 175 ఎమ్మెల్యే సీట్లు కచ్చితంగా గెలవాలని అన్నారు. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని.. లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది లేదన్నారు. కొన్ని కోట్ల మంది పేద ప్రజలు మనపై ఆధారపడి ఉన్నారని.. అధికారంలో ఉంటేనే వారికి మంచి జరుగుతుందని చెప్పారు.


కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి కూడా నష్టమే అని సీఎం జగన్ అన్నారు. సర్వే చేసినప్పుడు ఎమ్మెల్యేల గ్రాఫ్‌లు బలంగా ఉండాలని.. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీని వల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరుగుతుందని.. పార్టీకి మేలు జరుగుతుందని చెప్పారు. అలా జరగకపోతే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చక తప్పని పరిస్థితి వస్తుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.


ఇకపై గడప గడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని సీఎం జగన్ అన్నారు. పని తీరు బాగోలేక, టికెట్లు రాకపోతే తనను బాధ్యుడిని చేయొద్దని తెగేసి చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. అయితే, కొంత మంది వ్యతిరేక మీడియా ద్వారా మారీచుల్లా తమపై యుద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గత టీడీపీ సర్కారు పాలన, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు- నేడు ద్వారా ప్రజల వద్దకు చేర్చాలన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న నెగిటివ్‌ స్టోరీలపై ఫ్యాక్ట్‌ చెక్‌ ఇస్తున్నామని.. ఇందులో ఉన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికలకు సోషల్‌ మీడియా కూడా చాలా ముఖ్యమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇకపై ఎమ్మెల్యేలంతా సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa