ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరిగిన కూరగాయల ధరలు,,,కొండెక్కిన టమాటా, మిర్చి, అల్లం ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 08:29 PM

ఏపీలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి.. దీంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ కూరగాయల ధరల నియంత్రణకు సీఎం యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిర్చి వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.


రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌ రైతుబజార్ల ఎస్టేట్‌ ఆఫీసర్లతో సమీక్షిస్తున్నారు. సీఎం యాప్‌ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయంటున్నారు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే. అవసరమైతే మార్కెట్‌లో జోక్యం చేసుకుంటామన్నారు. టమాటా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.. రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో టమాట ధర పెరుగుతున్నట్లు గుర్తించారు.


కర్నూలు తప్ప మిగిలిన జిల్లాల్లో టమాటా బహిరంగ మార్కెట్‌లో టమాటా ధర కేజీ రూ.32 నుంచి 65 మధ్యలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ టమాటా ధరలు కిలో రూ.100 దాటితే మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించాలని భావిస్తున్నారు. అంతేకాదు మిర్చి ధరలు కూడా భారీగా పెరిగాయి.


మరోవైపు రాష్ట్రంలో టమాటా ధర దెబ్బకు జనాలు బెంబేలెత్తుతున్నారు. కిలో టమాటా ఏకంగా రూ.80 దాటేసింది.. కొన్ని ప్రాంతాల్లో అయితే కేజీ రూ.100కి చేరింది. ఇక పచ్చిమిర్చి ధర రైతు బజార్లలోనే రూ.100 ఉండగా.. బయట మార్కెట్లలో రూ.120 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. అల్లం ధర కూడా భారీగా పెరిగింది. కిలో ఏకంగా రూ.230 దాటేసింది.. మార్కెట్లో రూ.300 వరకు పలుకుతోంది. మిగిలిన కూరగాయలు రూ.30 నుంచి రూ.40 మధ్యకు చేరాయి.


టమాటా ధరలు భారీగా పెరగటానికి కారణాలు లేకపోలేదు. ఏపీ టమాటా ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉంది. అయితే ధరలు పెరగడానికి వర్షాలు ప్రధాన కారణం అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన ఈ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని.. అందుకే పంట దిగుబడి తగ్గిపోయిందంటున్నారు రైతులు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవడంతో ఈ ప్రభావం కూడా పడింది. దీంతో టమాటాతో పాటుగా కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa