ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టార్గెట్ అచ్చెన్నాయుడు,,,టెక్కలిలో వైసీపీ సరికొత్త వ్యూహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 08:29 PM

వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వాణి భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మొన్నటి వరకు టెక్కలి సమన్వయకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో వాణికి బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వాణి నిలబడతారని ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.


వాణిని టెక్కలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమిస్తారని గతంలోనే ప్రచారం జరిగింది. భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాంటిది ఏమీ లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంతలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వాణికి నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. టెక్కలి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సొంత నియోజకవర్గం కావడంతో వైఎస్సార్‌సీపీ ఫోకస్ పెట్టింది. మహిళా అభ్యర్థి అయితే తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అందుకే వాణి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


దువ్వాడ శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యారు.. 2009లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే ప్రజారాజ్యం పార్టీలో చేరి.. టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు.. 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2019లో శ్రీకాకుళం లోకసభ నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత టెక్కలి సమన్వయకర్తగా నియమించారు.


టెక్కలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం. అందుకే సీఎం జగన్ దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే కోటాలో 2021లో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆ తర్వాత టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సమయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇటీవల అనూహ్యంగా వాణికి ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.. ఇప్పుడు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే వాణి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. అటు శ్రీనివాస్ కూడా ఫోకస్ పెట్టారు. దీంతో టెక్కలి రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మహిళా అభ్యర్థి ఫార్ములా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి మరి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa