ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుభవార్త చెప్పారు. త్వరలో భర్తీ చేయబోయే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వాసులైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు బిహార్ క్యాబినెట్ సెక్రటేరియట్ అడిషినల్ చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ తెలిపారు. గతంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్థానికులను మాత్రమే నియమించుకొనేవారు.
తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండబోదని సిద్ధార్థ్ వెల్లడించారు. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అర్హత కలిగిన భారతీయ పౌరులు ఎవరైనా బిహార్లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని మొత్తం 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే 2న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. అయితే, స్థానికులకే కాకుండా రాష్ట్రేతరులను ఉద్యోగాలకు అనుమతించాలని విద్యా శాఖ ఇటీవల ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనపై మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 85,477 ప్రైమరీ టీచర్లు, 1,745 మాధ్యామిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
బీహార్ రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయ (నియామకం, బదిలీ, క్రమశిక్షణా చర్యలు మరియు సేవా పరిస్థితి) (సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. నియమితులైన అన్ని రకాల పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక జిల్లా కేడర్లతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైన హోదాను కలిగి ఉంటారని పేర్కొంది. 2006 నుంచి నియమితులైన వారు పంచాయితీ రాజ్ సంస్థలు కూడా ఈ కేడర్లో చేరే అవకాశం ఉంటుందని, అయితే దాని కోసం వారు కూడా పరీక్ష రాయాల్సి ఉంటుందని అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa