సరిగ్గా అక్షరాలు రాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అమ్మ ఒడి నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా జనసేనాని కౌంటర్ ఇచ్చారు.
సీఎం జగన్కు వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందన్నారు. తానేదో ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ తెగ బాధపడిపోతున్నారని.. ఇక నుంచి జగన్ స్టైల్లోనే ఇలా.. ఇలా మాట్లాడతానంటూ సీఎంను అనుకరిస్తూ సెటైర్లు వేశారు. అసలు అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో సీఎం జగన్ అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని ఫైరయ్యారు.
ఇదిలావుంటే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న వారాహి విజయయాత్ర సభ భీమవరంలో ఉంటుందని వెల్లడించారు. ఈ సభకు అందరి సహాయ సహకారాలు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈసారి భీమవరంలో జనసేన పార్టీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డికి ‘అ’ నుంచి ‘‘అం, అ:’’ వరకు అక్షరాలు రావని.. దీర్ఘాలు కూడా రావని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి తానే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తానని పేర్కొన్నారు. అలాంటి ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa