మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుదుటన ఓ అమ్మాయి తన కాలి బొటనవేలితో తిలకం (బొట్టు) దిద్దుతున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. జలగావ్లోని ‘దివ్యాంగ్ ఫౌండేషన్’ను ఫడ్నవీస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగ బాలిక ఆయనకు తన కాళ్లతో హారతి ఇచ్చి, కాలి బొటనవేలితో బొట్టుపెట్టి స్వాగతం పలికింది. ఈ దృశ్యం అందరినీ కదిలిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. బాలిక గురించి భావోద్వేగంగా రాసుకొచ్చారు.
‘‘ఇప్పటివరకూ నేను చాలా మంది తల్లులు, సోదరీమణుల నుంచి ఆశీర్వాద రూపంలో హారతి, తిలకం తీసుకున్నాను. ఈ రోజు కూడా అదే భావనతో తిలకం దిద్దేందుకు నా నుదిటి వద్దకు ఓ వేలు చేరింది. కానీ, ఈసారి అది చేతి బొటనవేలు కాదు. కాలి బొటనవేలు.
ఈ చెల్లెలు తన కాలి బొటనవేలుతో నా నుదుటిపై తిలకం దిద్దినప్పుడు, అదే బొటనవేళ్లతో హారతి ఇచ్చినప్పుడు.. ఆమె ముఖంలో నేను చిరునవ్వును, కళ్లలో మెరుపును చూశాను. ఆ మెరుపు ఎలాంటిదంటే.. ‘నన్ను ఎవరైనా ఓడిస్తారా? నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎవరి జాలీ అంతకన్నా అవసరం లేదు. నేను బలంగా ఉన్నాను. స్వయంగా ప్రకాశించగలను’ అని ఆమె కళ్లు చెబుతున్నట్లుగా అనిపించింది’’ అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ రాసుకొచ్చారు.
‘ఆ అమ్మాయితో నేను ఒక్కటే మాట చెప్పాను. సోదరీ.. నీ ప్రతి యుద్ధంలో మేము నీకు అండగా ఉంటాము. ఈ సోదరిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకుసాగాలి’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు కుసుమాగ్రజ్ జీ పంక్తులు గుర్తుకొచ్చాయంటూ.. ఆ కవితా పంక్తులను పంచుకున్నారు.
మహారాష్ట్రలో మారిన రాజకీయ పరిణామాల అనంతరం ఏక్నాథ్ షిండే.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఏక్నాథ్ షిండే.. తన అనుచరులతో కలిసి బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ కలిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారం కోల్పోగా.. ఏక్నాథ్ షిండ్ సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొలువుదీరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa