ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని కర్ణాటక సర్కార్ నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 10:27 PM

కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఉచిత బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తడంతో.. బియ్యానికి బదులు లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల వేళ ఇచ్చిన అన్న భాగ్య పథకం అమలు కోసం బియ్యం సరఫరా చేసేందుకు తగిన సరఫరా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ వెల్లడించింది. జూలై 1 నుంచి కర్ణాటకలో అన్న భాగ్య పథకం అమలు చేయాల్సి ఉంది. దీంతో అదే రోజు నుంచి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నేరుగా ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం తెలిపింది.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీలు ఇచ్చింది. ఇందులో ఒక్కొక్కటిగా సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కార్ అమలు చేస్తూ ఉంది. ఇందులో ఒకటైన అన్న భాగ్య పథకాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. ఈ పథకం కింద.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఇస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అవసరమైన బియ్యం లేకపోవడంతో నగదు జమ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కర్ణాటక మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు.


కిలో బియ్యానికి లబ్ధిదారులకు ఎంత చెల్లించాలి అన్నదానిపైనా మంత్రి వర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా - ఎఫ్‌సీఐ ప్రకారం కిలో బియ్యానికి రూ. 34 గా నిర్ణయించారు. ఈ మేరకు జులై 1 నుంచి కిలో బియ్యానికి రూ. 34 చొప్పున నగదును లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి మునియప్ప వెల్లడించారు. ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఒక రేషన్‌ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170.. ఇద్దరు వ్యక్తులు ఉంటే రూ.340.. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే నెలకు రూ.850 జమ చేస్తామని కర్ణాటక సర్కార్ వెల్లడించింది. అన్న భాగ్య పథకంలో భాగంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యానికి ఇది అదనం అని తెలిపింది.


ఈ అన్న భాగ్య పథకం అమలు చేసేందుకు అవసరమైన ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగింది. అన్న భాగ్య పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తెలంగాణ నుంచి బియ్యాన్ని సేకరించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం కేసీఆర్ సర్కార్‌ను కోరింది. దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కారు విఫలమైందంటూ భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa