ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో మారుతున్న రాజకీయ పరిణామాలు,,,సిటీ ఇంఛార్జ్‌ను మార్చేసిన టీడీపీ అధిష్టానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 09:13 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అనూహ్యంగా ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీకి దగ్గరయ్యారు.. అధికారికంగా పార్టీలో చేరకపోయినా.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దు తెలిపారు. అక్కడితో ఆగకుండా తమ నియోజకవర్గాల్లో విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు.. జిల్లాలోని నియోజవర్గాలపై ఫోకస్ పెట్టారు. వివాదాలకు చెక్ పెడుతూ అవసరమైన మార్పుల చేర్పులు చేస్తున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ని మార్చేశారు. మాజీ మంత్రి నారాయణకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బాలయ్య స్నేహితుడు, నిన్నటి వరకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి నిరాశే మిగిలింది. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ఆయనకు ఇది ఊహించని పరిణామమే అని చెప్పాలి. అయితే నారాయణకు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధిష్టానం.. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించారు. భవిష్యత్‌లో కచ్చితంగా న్యాయం చేస్తామని కోటంరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.


2014 ఎన్నికల్లో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయగా.. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ టీడీపీ నుంచి బరిలోకి దిగారు.. స్వల్ప తేడాతో అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన నారాయణ.. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇదే క్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు సిటీలో యాక్టివ్ అయ్యారు. అంతేకాదు శ్రీనివాసులురెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు సన్నిహితుడు కూడా. దీంతో అధినేత చంద్రబాబు నియోజకవర్గ బాధ్యతల్ని కోటంరెడ్డికి అప్పగించారు.


శ్రీనివాసులురెడ్డి కూడా నెల్లూరు సిటీలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ దూకుడు పెంచారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల గెలుపు కోసం సాధ్యమైనంత వరకు పనిచేశారు.. కానీ ఫలితాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన్ను ఓ యువకుడు కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొద్ది రోజులకు ఆయన కోలుకున్నారు.. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మధ్య బాలయ్యను కూడా కలిశారు.


ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధత్యల నుంచి తప్పించి.. మాజీ మంత్రి నారాయణకు పగ్గాలు అప్పగించారు. అయితే ఈ నియామకంపై కోటంరెడ్డి ఇంకా స్పందిచలేదు. అయితే కోటంరెడ్డిని ఒప్పించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేద్దామనుకున్న బాలయ్య సన్నిహితుడికి ఈ నియామకం నిరాశే మిగిల్చిందని చెప్పాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa