నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం ఈ నెల 28వ తేదీన ఛలో ఢిల్లీ చేపట్టనున్నట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కర్నూలులో బైరెడ్డి రాజశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కర్నూలును రాజధానిగా పెట్టి మళ్లీ హైదరాబాద్ తరలించారని.. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయ రాజధాని పెడతామని అంటున్నారని పేర్కొన్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని మండిపడ్డారు.
రాయలసీమ నాయకులు తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. తమ దగ్గర ఉన్నంత ఖనిజ సంపద మరెక్కడా లేదని.. ఐరన్ ఓర్, బరైటీస్, మైనింగ్ కొల్లగొట్టుకుపోతున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ అంటే పెట్టుబడులు పెట్టే వారే రావడం లేదన్నారు. సినిమాల్లో తమ ప్రాంతం వాళ్లను రౌడీలు, కబ్జాకోరులుగా చూపించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. రాయలసీమ హక్కుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏమీ చేయలేదని విమర్శించారు.
తమ ప్రాంతానికి మీరు చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రూ. 26 వేల కోట్లతో కడుతున్నారని.. దీని వల్ల కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పర్ భద్ర వల్ల రాయలసీమ నాశనం అవుతుందని కేంద్రానికి సీఎం జగన్ ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎందుకూ పనికి రాని కేబుల్ బ్రిడ్జి ఎందుకు... సెల్ఫీలు దిగడానికా అని నిలదీశారు. సీఎం జగన్కు ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోరు, వినిపించుకోరని.. ఆయన చెవిలో సీసం పోసుకున్నారు కాబట్టే సేవ్ రాయలసీమ పేరుతో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకే రాయలసీమ హక్కుల కోసం జూలై 28న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.
సీఎం జగన్ అమ్మ ఒడి, తాత గోచి పేరుతో మాయ, మోసం చేస్తున్నారని బైరెడ్డి రాజశేఖరరెడ్డి మండిపడ్డారు. ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను సీఎం జగన్ నాశనం చేశారన్నారు. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష మన పెద్దలు ఆచారంగా పెట్టి వెళ్లారని.. ఇప్పుడు ఆ బాలశిక్ష అంటే ఏమిటో పిల్లలకు తెలియకుండా చేశారని దుయ్యబట్టారు. బటన్ నొక్కడం ఒక వైపు.. మరో వైపు కత్తిరించడమే జగన్ పాలన అంటూ విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa