విజయవాడలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ కావడంతో కపర్ది థియేటర్లో రెచ్చిపోయారు.. స్కీన్ చింపేయడంతో పాటుగా సీట్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు.
విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 8మంది పవన్ కళ్యాణ్ అభిమానులు. గత నెల 30న కపర్ది థియేటర్లో ప్రదర్శిస్తున్న తొలిప్రేమ సెకండ్ షోకు వెళ్లారు. వారిలో కొంతమంది మద్యం సేవించి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సినిమాలో పాట వస్తుండగా వాళ్లంతా కలిసి తెర ముందు ఉన్న సిమెంట్ దిమ్మెపైకి ఎక్కారు. అక్కడ తెరను పట్టుకుని డ్యాన్స్లు వేశారు. థియేటర్ సిబ్బంది వద్దని వారించి.. కిందికి దింపేశారు.
ఫ్యాన్స్ సిబ్బందితో గొడవపడి దాడి చేశారు.. అలాగే స్కీన్ చిరగగా, సీట్లను కూడా ధ్వంసం చేశారు. థియేటర్ ప్రతినిధులు ఫిర్యాదు చేయలేదు.. అయినా సరే సత్యనారాయణపురం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. తెర ముందు వేసిన డ్యాన్స్లు, గొడవ చేసిన వీడియోలను ఈ ఎనిమిది మంది వాట్సాప్ స్టేట్స్లో పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది ఇన్స్టాలో పోస్టు చేశారని.. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో కపర్థి థియేటర్లో సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే థియేటర్లో ఫ్యాన్స్ హంగామా చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 8మందిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa