రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించేందుకు ఒక వేదిక ఉండాలనే యువగళం పాదయాత్ర చేస్తున్నానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో మహిళా శక్తి పేరిట సోమవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు చెల్లి అంటే ఇష్టమని.. తనకు అమ్మాయి పుట్టాలని కోరుకున్నట్లు లోకేష్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను వేధించిన ఎవరినీ వదిలిపెట్టబోమని నారా లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబునాయుడును ఎవరైనా తిడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తారని చెప్పారు. ఒక తల్లిపడే బాధ, ఆవేదన నేను చూశానని పేర్కొన్నారు. శాసనసభ, ప్రజల సాక్షిగా తన తల్లిని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలు ఎవరికీ పనికిరావని.. తన తాపత్రయం అంతా ఒక్కటే.. ఏ మహిళకూ అవమానం జరగకూడదని లోకేష్ వ్యాఖ్యానించారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) మహిళల కోసం యూనివర్శిటీ ఏర్పాటు చేశారని, ఆస్థిలో సగభాగం హక్కు కల్పించారని లోకేష్ గుర్తు చేశారు. చంద్రబాబు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మహిళలు, యువతులవైపు చూడాలన్నా భయపడేవారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి వీధిలో మద్యం పారేలా చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa