ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పబ్‌జీలో ఏర్పడిన పరిచయంతో భారత్ వచ్చిన మహిళ,,,పాక్ వెళ్లేందుకు నిరాకరిస్తున్న పాకిస్థాన్ మహిళ

national |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 09:27 PM

ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడిన వారి కోసం కొంత మంది ముందు వెనక చూసుకోకుండా ఇంట్లో నుంచి వచ్చేస్తూనే ఉంటారు. అయితే అందులో కొంత మంది ప్రేమ పెళ్లిగా మారి సంతోషంగా జీవిస్తుంటే.. చాలా మంది మాత్రం.. ఆ ప్రేమ పెళ్లిగా కాకుండా పెటాకులు అయిన సంఘటనలే ఎక్కువ చూశాం. ఇటీవల పబ్జీ గేమ్‌లో ఏర్పడిన పరిచయంతో పాకిస్థాన్‌ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఢిల్లీ వచ్చిన మహిళను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళతో సహా పరిచయమైన వ్యక్తిని, అతడి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే వారు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె మాత్రం తిరిగి పాకిస్థాన్ వెళ్లనని.. ఇక్కడే ఉంటానని తేల్చి చెబుతోంది. దీంతో కొత్త తలనొప్పి వచ్చి పడింది.


ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఓ అద్దె ఇంట్లో అక్రమంగా నివాసం ఉంటున్న పాక్ మహిళ నలుగురు పిల్లలతో కనిపించింది. అయితే నోయిడాలోని రబుపురాకు చెందిన 25 సచిన్ మీనాకు.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 30 ఏళ్ల సీమా హైదర్‌కు 2019 లో పబ్‌జీ గేమ్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్ మీనా.. అతని తండ్రి నేత్రపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది.


అయితే సచిన్ మీనాకు, సీమా హైదర్‌కు పెళ్లి అయినట్లు సీమా హైదర్ లాయర్ హేమంత్ కృష్ణ పరాశర్ చెబుతున్నారు. అయితే కరాచీ నుంచి సీమా హైదర్.. నేపాల్ వచ్చిందని నోయిడా నుంచి సచిన్ మీనా నేపాల్ వెళ్లినట్లు తెలిపారు. ఇద్దరూ కలిసి ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడే ఓ వారం పాటు హనీమూన్ కూడా చేసుకున్నట్లు వివరించారు. తర్వాత వీరిద్దరూ కలిసి మే 13 న నేపాల్ నుంచి బస్సులో నోయిడా చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే జులై 4 వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీమా తన భర్త నుంచి విడాకులు పొందినట్లు కోర్టుకు తెలిపింది. తాను పాకిస్థాన్ వెళ్లనని.. ఇక్కడే సచిన్ మీనాతో కలిసి ఉంటానని చెబుతోంది.


అయితే సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ మాత్రం తాము విడాకులు తీసుకోలేదని చెబుతున్నాడు. గులామ్ హైదర్ సౌదీ అరేబియాలో టైల్స్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీమా అరెస్ట్ విషయం భారతీయ మీడియాలో చూసిన గులామ్ హైదర్ వీడియో ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన భార్యను తన దేశానికి పంపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. తాను తన భార్యా, పిల్లలను పోషించేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నట్లు తెలిపారు. తన భార్య, నలుగురు పిల్లలను పాకిస్థాన్ పంపించాలని ప్రాధేయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa