భారీ వర్షాల కారణంగా మూడు రోజుల నుంచి నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర ఆదివారం పునఃప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని పంజ్తర్ణి, శేష్నాగ్ క్యాంపుల నుంచి హిమలింగ దర్శనానికి యాత్రికులు బయల్దేరారు. పంజ్తర్ణిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా.. వీరిలో దాదాపు 200 మంది తెలుగు యాత్రికులు ఉన్నారు. అమర్నాథ్ ఆలయం వద్ద వాతావరణం తెరిపినివ్వడంతో అధికారులు తక్షణమే గేట్లను తెరిచి భక్తులు పూజలు చేసేందుకు అనుమతించారు. ఇప్పటికే దర్శనం పూర్తయిన భక్తులను బల్తాల్ బేస్ క్యాంప్కి చేరుకొనేందుకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, అనంతనాగ్లో క్వాజిగుండ బేస్క్యాంప్లో 700 మంది యాత్రికులకు సైన్యం ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది. అటు, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేయడంతో జమ్మూ బేస్ క్యాంప్ నుంచి కొత్తగా యాత్రికులను ముందుకు అనుమతించడం లేదు. ఈ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్బన్ జిల్లాలో దాదాపు 40 అడుగుల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో హైవేపై 3,500 వాహనాలు చిక్కుకుపోయాయి.
గురువారం రాత్రి నుంచి జమ్మూ-కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో అమర్నాథ్ గుహ వద్ద భారీగా హిమపాతం కురుస్తోంది. దీంతో దాదాపు దాదాపు 50 వేల మంది యాత్రికులు తమ తమ బేస్ క్యాంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రాంబన్లో 6 వేల మంది భక్తులు చిక్కుకున్నారు. అమర్నాథ్ గుహకు ఆరు కిలోమీటర్ల దూరంలోని పంచ్ తర్ణ్లో కనీసం 80 మంది కర్ణాటక యాత్రికులు చిక్కుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాంబన్ డిప్యూటీ కమిషనర్ ముస్సారత్ ఇస్లాం తెలిపారు. ‘ప్రతికూల వాతావరణంతో అమర్నాథ్ యాత్రను నిన్న నిలిపివేశాం.. యాత్రికుల కోసం యాత్రి నివాస్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం.. వారికి ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం’ అని చెప్పారు. జులై 1 నుంచి యాత్ర ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ 67,566 మంది దర్శించుకున్నారు. జులై 5న బల్తాల్ బేస్ క్యాంప్, నున్వాన్ క్యాంప్ నుంచి 18,354 మంది అమర్నాథ్ గుహకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 12,483 మంది పురుషులు, 5,146 మంది మహిళలు, 457 మంది పిల్లలు, 266 మంది సాధువులు.. ఇద్దరు సాధ్వీలు ఉన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకూ ఈ యాత్ర 62 రోజుల పాటు కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa