పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో జనాలు భారీ సంఖ్యలో అక్కడికి క్యూ కట్టి.. వెతుకులాట ప్రారంభించారు. పిడుగురాళ్ల రోడ్డు శివారు ప్రాంతమైన బసవమ్మ వాగు దగ్గర రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు.. అక్కడ రోడ్ల కోసం బెల్లంకొండ నుండి తెచ్చిన ఎర్రమట్టిని పోశారు. ఈ విషయం తెలిసిన కొందరు వజ్రాలు, రంగు రాళ్లు దొరుకుతాయేమోనని వేట మొదలుపెట్టారు. వర్షం పడితే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి రోజంతా అక్కడే ఉండి రాళ్ల కోసం కోసం వెతుకుతున్నారు.
ఈ విషయం తెలియడంతో సత్తెనపల్లితో పాటుగా చుట్టుపక్కల ఉన్న నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, వినుకొండ ప్రాంతాల నుంచి కూడా వాహనాలలో జనాలు అక్కడికి వచ్చి.. ఒకటి దొరికినా చాలని వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. గతంలో బెల్లంకొండ మండలం కోళ్లూరులో వజ్రాలు దొరికాయనే ప్రచారం ఉంది. అక్కడ కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలించారట.. ఆ ప్రాంతం నుంచి తెచ్చిన మట్టి కావడంతోనే ఇలా గాలిస్తున్నారు. అందులో పక్కాగా వజ్రాలు, రంగు రాళ్లు ఉంటాయని నమ్ముతున్నారు.
అంతేకాదు వజ్రాల టెస్టింగ్ మెషిన్లతో బంగారు వర్తక వ్యాపారుల దర్శనమిస్తున్నారట.. బంగారు వ్యాపారులు టెస్టింగ్ మెషీన్లతో వ్యాపారం ప్రారంభించారట. టెస్టింగ్కు రూ.100 తీసుకుంటున్నారట. గతంలో కూడా తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్లూరు వెళ్లి.. అక్కడ కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారని చెబుతున్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట కొనసాగుతోంది.
సాధారణంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తొలకరి వానలు పడగానే వజ్రాల కోసం వేట ప్రారంభమవుతుంది. ఇటీవల పలువురు రైతులు, వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి.. వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి, కోటీశ్వరులు కావొచ్చని ఆశగా వెళుతుంటారు. పల్నాడు జిల్లాలో కూడా అదే ఆశతో జనాలు వజ్రాల వేటకు వెళుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa