ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చప్పింది. రాష్ట్రంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల ఉందని.. అందుకే పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో.. రాష్ట్రంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సామాజిక బాధ్యతలో భాగంగా వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే వారి నుంచి సానుకూల స్పందన లభించిందని అరుణ్ కుమార్ తెలిపారు. మరోవైపు ధరల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ దగ్గర ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ https://fcainfoweb.nic.in/psp/లో నమోదు చేయాలని సూచించామన్నారు.
అంతేకాదు ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు అరుణ్ కుమార్. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని.. వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో పాటుగా సరుకు నిల్వలు లేకపోవడం.. ఇటు స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు తగ్గిపోయాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి గోధుమ పిండి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర రూ.16 మాత్రమే.. కానీ మార్కెట్లో మాత్రం గోధుమ పిండి కిలో రూ.40 వరకు ఉంది. ఒక్కో రేషన్ కార్డుపై రెండు కిలోల లెక్కన కిలో ప్యాకెట్లను రెండింటిని పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పేదలకు చిరు ధాన్యాలను అందిస్తున్నారు. జొన్నలు, రాగుల పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రేషన్ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇస్తారు. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు ఇస్తారు. అంతేకాదు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ చిరు ధాన్యాలను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్లో పంపిణీ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa