మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని రెబల్స్ మరోసారి శరద్ పవార్తో భేటీ కానున్నారు. తిరుగుబాటు నేతలు శరద్ పవార్ను రెండు రోజుల్లో కలవడం ఇది రెండోసారి. రెండు వారాల కిందట అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. తిరుగుబాటు తర్వాత ఆదివారం నాడు మొదటిసారిగా శరద్ పవార్ను కలిసిన రెబల్స్.. పార్టీని చీలిపోకుండా చూడాలని కోరారు.
పవార్తో భేటీ అనంతరం రెబల్ క్యాంపులోని ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘శరద్ పవార్ ఏం మాట్లాడలేదు.. మేము చెప్పింది మాత్రమే విన్నారు.. సమావేశం తర్వాత మేము వెనక్కి వెళ్తున్నాం.. ఈ రోజు మా దేవుడు.. మా నేత శరద్ పవార్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నాం’ అని అన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. రెబల్ నేతలు వెళ్లిపోయిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన శరద్ పవార్.. తాను ప్రగతిశీల రాజకీయాలను కొనసాగిస్తానని, బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే పనిలో ఎన్సీపీ చీఫ్ నిమగ్నమై ఉన్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగే విపక్షాల సమావేశానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్సీపీలో ‘చీలిక’ పరిణామాల తర్వాత శరద్ పవార్తో ఆదివారం అజిత్ పవార్ భేటీ అయిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై ఆ పార్టీ సోమవారం స్పష్టత నిచ్చింది. విపక్షాల భేటీకి తమ అధినేత హాజరవుతారని స్పష్టం చేసింది. మంగళవారం ఆయన వెళ్లనున్నారని, పవార్తో పాటు కుమార్తె సుప్రియా సూలే కూడా విపక్షాల భేటీలో పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటన చేసింది. కాగా, మళ్లీ బాబాయితో అజిత్ భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
మరోవైపు, మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే, అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు పోటాపోటీగా విప్లను జారీచేశాయి. కాగా, ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం ఇచ్చిన టీపార్టీ ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నామని తెలిపారు.. రాజ్యాంగ నిబంధనల పరంగా ప్రభుత్వ చెల్లుబాటు ఇప్పటికీ ప్రశ్నార్ధంగానే ఉందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిచారని, మహారాష్ట్ర ముఖ్యమంత్రే అనర్హతను ఎదుర్కొంటారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa