ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్‌లను చూస్తే భయపడిపోతున్న రష్యా

national |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2023, 10:23 PM

సెల్‌ఫోన్ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది యాపిల్ సంస్థ. దీంతో ఆ సంస్థ ఉత్పత్తులు ఖరీదైనప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యాపిల్ లవర్స్ ఎదురు చూస్తుంటారు. అయితే రష్యా మాత్రం.. ఆ సంస్థ భద్రతపై అనుమానం వ్యక్తం చేసింది. ఐఫోన్లు, వాటి ఉత్పత్తులు వాడటంపై పుతిన్ సర్కార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో వేలాది మంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు యాపిల్, ఐఫోన్లు ఉపయోగించవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది.


అయితే యాపిల్ ఉత్పత్తులు, ఐఫోన్లపై రష్యా అనుమానాలు వ్యక్తం చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. అయితే ఈ యాపిల్‌ సంస్థ అమెరికాకు చెందింది కావడంతో.. తమపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయని పుతిన్ భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే రష్యా అధ్యక్ష భవనం అయిన క్రెమ్లిన్‌ .. తమ అధికారులకు ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రష్యా వాణిజ్యశాఖ కూడా ఇదే రకమైన ఆదేశాలను తమ ఉద్యోగులకు ఇచ్చింది. తమ సంస్థలపై అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గూఢచర్యానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని క్రెమ్లిన్‌ సహా రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐఫోన్లకు బదులు.. వేరే కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్లను ఉపయోగించాలని.. డిప్యూటీ మంత్రులు, ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య శాఖ కూడా ఆఫీస్‌కు సంబంధించిన వివరాలు, విషయాల కోసం ఐఫోన్‌ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీతోపాటు ప్రభుత్వ నిర్వహణలోని రోస్టెక్‌ సంస్థ కూడా ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ దేశాలు రష్యాపై క్రమంగా ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ, ఆర్థిక రంగాల్లో 2025 నాటికి రష్యాలో అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌నే వాడాలన్న నిర్ణయంపై సంతకం చేశారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన యాపిల్‌ సంస్థ ఉత్పత్తుల వాడకంపై అనధికారిక నిషేధం విధించినట్లయింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన పుతిన్‌కు ఆది నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సునాయసంగా యుద్ధంలో ఉక్రెయిన్‌ను ఓడిస్తామన్న పుతిన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా పోరాటం సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల రష్యా కిరాయి సైన్యం అయిన వాగ్నర్ గ్రూప్.. దేశంలో తిరుగుబాటు జెండా ఎగురవేసింది. రష్యా సైనిక పాలనను అంతం చేస్తామని ప్రకటించింది. అయితే ఆ పోరాటం అనూహ్యంగా ఒక్కరోజులోనే ముగిసిపోవడంతో తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa